ప్రయాగ్రాజ్, డిసెంబర్ 19: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయాలని అలహాబాద్ హైకోర్టు జిల్లా కోర్టును ఆదేశించింది. 1991లో దాఖలైన ఈ కేసు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. వివాదాస్పద స్థలం ఏ మతం వారికి చెందుతుందో కోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు మేనేజింగ్ కమిటీ, ఉత్తరప్రదేశ్ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన ఐదు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
మసీదు స్థానంలో ఆలయాన్ని పునఃప్రతిష్టించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ప్రార్థనా స్థలాల చట్టం, 1991 అడ్డుకోలేదని పేర్కొంది. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం, 1947, ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల స్వభావాన్ని మార్చకూడదు. అయితే ఆ చట్టం ‘ప్రార్థనా స్థలాల స్వభావం’ అన్న అంశాన్ని నిర్వచించలేదని, కేవలం కోర్టులు మాత్రమే సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ణయిస్తాయని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ పేర్కొన్నారు. జ్ఞానవాపి కాంపౌండ్కు హిందూ మత స్వభావం లేదా ముస్లిం మత స్వభావం మాత్రమే ఉండాలని, ఒకేసారి రెండు స్వభావాలను అది కలిగి ఉండలేదని వ్యాఖ్యానించారు.
జ్ఞానవాపి మసీదుపై అలహాబాద్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తామని, ఆఖరి శ్వాస వరకు న్యాయం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ మంగళవారం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీనికి సంబంధించి కోర్టు వెలువరించిన ఆదేశాలు ఇంకా తమ చేతికంద లేదని, వచ్చిన తర్వాత దానిని మేనేజ్మెంట్ కమిటీతో చర్చించి బుధవారం సాయంత్రంలోగా నిర్ణయం వెలువరిస్తామని అంజుమన్ ఇంతెజామియా మసీదు సంయుక్త కార్యదర్శి సయ్యద్ మహమ్మద్ యాసిన్ చెప్పారు.