Krishna Ella | భారతీయ ఔషధాల నాణ్యత ప్రమాణాన్ని నిర్ధారించేందుకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్ర సంస్థలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్లో విలీనం చేయాలని భారత్ బయోటెక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. దేశానికి చెందిన ఔషధాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్కు చెందిన కంటి చుక్కల మందుతో కారణంగా ఒకరు మృతి చెందగా.. పలువురు పలు సమస్యలు ఎదురుకావడంతో కంపెనీ చుక్కల మందును రీకాల్ చేసింది. గతేడాది గాంబియా, ఉబ్జెకిస్థాన్లో భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా చిన్నారుల మరణాల కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ కొన్ని విషయాలతో మొత్త భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమను కించపరుచలేమన్నారు. పాశ్చాత్య దేశాల్లోనూ నాణ్యతా సమస్యలపై కంపెనీలకు జరిమానాలు విధించారన్నారు. భారత్లో డ్రగ్స్కు రెగ్యులేటర్ ఉండాలన్నారు. అన్ని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)లో విలీనం చేయాలని, దాంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఇందుకు రాజకీయ నిర్ణయం, నిబద్ధత అవసరమన్నారు. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్కు చెందిన నాసల్ వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైందని, రెండు రోజుల క్రితమే కొన్ని ఆసుపత్రులకు 3లక్షల డోసులను పంపినట్లు కృష్ణా ఎల్లా తెలిపారు.
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా ఎల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్-మాడిసన్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ (GHI), ఎల్లా ఫౌండేషన్ మధ్య ఆదివారం ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. బెంగళూరులోని యూడబ్ల్యూ-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ 2023 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని కృష్ణా ఎల్లా చెప్పారు. భారతదేశానికి కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తికి ఈ ఆరోగ్య కేంద్రం సహాయపడుతుందన్నారు. భారతదేశంలో పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందిస్తుందన్నారు.