న్యూఢిల్లీ: శవపేటికలుగా మారిన మిగ్ యుద్ధ విమానాలకు భారత వాయు సేన (ఐఏఎఫ్) వీడ్కోలు చెప్పనున్నది. మరో మూడేళ్లలో మిగ్-21 ఫైటర్ స్క్వాడ్రన్లను స్వరీస్ నుంచి పూర్తిగా తొలగించనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి దీనికి శ్రీకారం చుట్టనున్నది. ఈ మేరకు సంబంధిత వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి. 2025 నాటికి నాలుగు మిగ్-21 స్క్వాడ్రన్లను పూర్తిగా గ్రౌండ్ చేయనున్నట్లు చెప్పారు. శ్రీనగర్లోని 51వ మిగ్-21 స్క్వాడ్రన్లోని 17-20 విమానాలకు ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వివరించారు. అలాగే మిగ్-29 ఫైటర్ జెట్ల మూడు స్క్వాడ్రన్లను దశల వారీగా వచ్చే ఐదేళ్లలో అంటే 2027 నాటికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించారు.
కాగా, రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం మరో మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ బల్ మరణించారు. దీంతో మిగ్-21 విమానాల భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
భారత వాయుసేనలో ఎక్కువ కాలం కొనసాగుతున్న యుద్ధ విమానంగా మిగ్-21 రికార్డులకెక్కింది. తరుచూ ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవుతుండటంతో కాలం చెల్లిన వీటికి వీడ్కోలు పలకాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరో మూడేళ్లలో వీటికి గుడ్ బై చెప్పాలని ఐఏఎఫ్ నిర్ణయించింది.