న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితోపాటు కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరం, ఒంటి నొప్పి వంటి లక్షణాలు ఉంటే తప్పకుండా కరోనా టెస్ట్ చేయాలని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానంగా 8 లక్షణాల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. దగ్గు ఉన్నా లేకపోయినా.. జ్వరం, ఒంటి నొప్పి, తల నొప్పి, గొంతు నొప్పి, ఇటీవలి రుచి లేదా వాసన కోల్పోవడం, అలసట, అతిసారం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలున్న వ్యక్తులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ కాకపోయినా కరోనా అనుమానిత కేసుగా పరిగణించాలని పేర్కొంది. ఈ ఎనిమిది లక్షణాలున్న వ్యక్తులకు తప్పని సరిగా కరోనా టెస్ట్ చేయాలని వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం లేఖ రాసింది. ఆర్టీ-పీసీఆర్ ఫలితాలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున యాంటిజెన్ పరీక్షలను వేగవంతం చేయాలని కోరింది. ప్రభుత్వం ఆమోదించిన స్వీయ పరీక్షా కిట్లను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించింది.