న్యూఢిల్లీ, జూలై 28: ఓటరు ఐడీ కార్డు కోసం ఏడాది ముందుగానే దరఖాస్తు చేసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో 17 ఏండ్లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకునే వీలు కలుగనున్నది. ఇప్పటివరకు ఏదైనా సంవత్సరంలో జనవరి 1వ తేదీకి ముందు 18 ఏండ్లు నిండినవారు ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే జనవరి 1 తర్వాత 18 ఏండ్లు నిండివారు దరఖాస్తు చేసుకోవాలంటే మరో ఏడాది వరకు వేచి చూడాల్సి వచ్చేది.దీంతో ఏడాది ముందుగానే అంటే 17 ఏండ్లు రాగానే దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి 18 ఏండ్లు రాగానే ఓటరు కార్డు వస్తుందన్న మాట.
పైగా ఇప్పటి నుంచి ఏడాదిలో జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తుగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సాంకేతికతను సిద్ధం చేయాలని రాష్ర్టాల్లోని ఎన్నికల కమిషనర్లకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్ అనూప్ చంద్రపాండే ఆదేశాలు జారీ చేశారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమానికి సంబంధించి ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 2023 నాటికి 18 ఏండ్లు పడిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఓటరు కార్డుకు, ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని పేర్కొన్నారు.