ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ సెంటర్ల నుంచి ఈవీఎంలను దొంగలిస్తున్నారని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే, నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఈవీఎంలను తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇక.. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, తమకు ఎన్నికల సంఘంపై ఏమాత్రం నమ్మకం లేదని సంచలన ఆరోపణలు చేశారు.
ఇక.. బీజేపీ ఓడిపోయే చోట్ల కౌంటింగ్ను అత్యంత నెమ్మదిగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు కూడా అందాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో యూపీ ఎన్నికలే చివరి అస్త్రమని, వీటి తర్వాత ఇక.. ఎవరికి సంబంధించిన స్వేచ్ఛ కోసం వారు పోరాడాల్సిందేనని అన్నారు. ఈ విషయంపై తాము కోర్టులకు వెళ్లొచ్చని, అయితే.. తమతో కలిసి వచ్చేవారందరూ ఈ విషయంపై ఆలోచించాలన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు.
వారణాసి అధికారులు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండానే ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈసీ ఈ విషయంపై వెంటనే జోక్యం చేసుకోవాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. ఈవీఎంలను ఇలా తరలిస్తే మాత్రం నేతలు, కార్యకర్తలందరూ అలర్ట్గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలా తరలించడం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. సమాజ్వాదీ మద్దతుదారులు, కార్యకర్తలు అందరూ ఓట్లను లెక్కపెట్టే సమయంలో కెమెరాలతో సిద్ధంగా ఉండాలని, రిగ్గింగ్ కాకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలందరూ అలర్ట్గా ఉండాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు.