ముంబై : లౌడ్స్పీకర్లపై హాట్ డిబేట్ సాగుతున్న వేళ ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ రాజ్ ఠాక్రేను పరోక్షంగా ప్రస్తావిస్తూ మొరిగే కుక్కలంటూ మండిపడ్డారు.
సింహం నడిచివస్తుంటే కుక్కలు మొరుగుతాయని వ్యాఖ్యానించారు. ఆపై ఓవైసీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని సందర్శించారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు అక్బరుద్దీన్పై విమర్శలు గుప్పించాయి. ఔరంగజేబు సమాధిని సందర్శించడం ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ మత ఉద్రిక్తతలను ప్రేరేపిస్తున్నారని శివసేన నేత చంద్రకాంత్ ఖైరే ఆరోపించారు.
క్రూరమైన మొఘల్ చక్రవర్తి సమాధిని సందర్శించిన ఓవైసీపై కఠిన చర్యలు చేపట్టాలని ఎంఎన్ఎస్ డిమాండ్ చేసింది. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తమ పార్టీ చట్టపరంగా ముందుకెళుతుందని ఎంఎన్ఎస్ నేత గజానన్ కాలే స్పష్టం చేశారు.