ముంబై : మహారాష్ట్ర తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధి రేసులో ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘడి సర్కార్ ను శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, ఈ ప్రభుత్వం వెనుక వారున్నంతవరకూ సర్కార్ కు ఢోకా లేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.
అయితే అన్ని పార్టీలకు తమ బలాన్ని పెంచుకునే హక్కు ఉంటుందని, ఎవరైనా సీఎం కావాలని కోరుకోవడంలో తప్పులేదని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు 145 మంది ఎమ్మెల్యేలతో మేజిక్ ఫిగర్ సాధించడం అవసరమని చెప్పారు.
కాగా వచ్చే ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ నేత నానా పటోలె చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక హైకమాండ్ తనకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పటోలె ఇటీవల పేర్కొనడం సేన-కాంగ్రెస్-ఎస్పీపీ సర్కార్ లో లుకలుకలను బయటపెట్టింది.