న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బారులు తీరిన విమానాల్లో గంటల తరబడి ఉక్కిరిబిక్కిరయ్యారు. దట్టమైన పొగమంచు, దారి కనిపించని ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు బయల్దేరడం ఆలస్యమవడంతో గత్యంతరం లేని స్థితిలో పడిపోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉండటంతో అత్యవసరం కాని భవన నిర్మాణ పనులు, బీఎస్-3 పెట్రోలు, బీఎస్-4 డీజిల్ నాలుగు చక్రాల వాహనాల రాకపోకలను ఆదివారం నిషేధించారు. దేశ రక్షణ, రైల్వేలు, మెట్రో రైల్, హైవేలు, రోడ్లు, విద్యుత్తు సరఫరా వంటివాటిని ఈ నిషేధం నుంచి మినహాయించారు. ఈ నగరంలో గాలి కాలుష్యాన్ని తగ్గించే వ్యూహాలను అమలు చేసే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది.ప్రతికూల వాతావరణంతోపాటు స్థానిక కాలుష్యం వల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పెరిగింది.