Air India flight : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి బెంగళూరు (Bengalore) కు వచ్చిన ఎయిరిండియా (Air India) విమానానికి ల్యాండింగ్ సమయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్వే (Run way) పై దిగుతున్న తరుణంలో దాని తోక భాగం భూమిని బలంగా తాకింది. అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు 179 మంది ప్రయాణికులతో వచ్చిన AI 2651 ఎయిర్ బస్ విమానం ల్యాండింగ్ కావడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో రన్వేపై నుంచి మరో పెద్ద విమానం టేకాఫ్ కావడంతో గాల్లో తీవ్రమైన గాలి ఉద్ధృతి ఏర్పడింది. దాంతో విమానం బ్యాలెన్స్ తప్పింది. పైలట్లు ల్యాండింగ్ నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ విమానాన్ని పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం తోక భాగం రన్వేను గీసుకుంటూ వెళ్లింది.
అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిరిండియా సంస్థ ఈ ఎయిర్బస్ ఏ321 విమానాన్ని తదుపరి తనిఖీల కోసం ఎయిర్పోర్టులోనే నిలిపివేసింది. దీనివల్ల బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లాల్సిన AI 2652 ఫ్లైట్ను క్యాన్సిల్ చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రమాదంపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. నిబంధనల ప్రకారం దర్యాప్తు పూర్తయ్యే వరకు సదరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిరిండియా గ్రౌండ్ టీమ్స్ ప్రయాణికులకు అవసరమైన సాయాన్ని అందించాయి.