న్యూఢిల్లీ: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది రక్షణ దళ సిబ్బంది డిసెంబర్ 8వ తేదీన జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి రక్షణశాఖ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తు నివేదికను ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్కు సమర్పించనున్నారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో హెలికాప్టర్ కూలిన ఘటన తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రికి దర్యాప్తు కమిటీ నివేదికను సమర్పించనున్నది.
ప్రమాద ఘటనపై ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైయిరీ నడిచింది. ఇండియాలో మేటి హెలికాప్టర్ పైలెట్గా మన్వేంద్ర సింగ్కు గుర్తింపు ఉన్నది. ఎంఐ17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై ఆయనే రిపోర్ట్ తయారు చేశారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల.. ఆ సమయంలో అయోమయానికి లోనైన పైలెట్.. ఆ ఆందోళనలో హెలికాప్టర్ను ప్రమాదవశాత్తు కొండల వైపే తీసుకువెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీన్నే సీఎఫ్ఐటీ అంటారు. అంటే కంట్రోల్డ్ ఫ్లయిట్ ఇన్ టు టెర్రెయిన్. ప్రమాదంలో ఎటువంటి సాంకేతిక లోపం కానీ మెకానికల్ లోపాలు కానీ లేవని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్ అత్యంత కచ్చితమైన హెలికాప్టర్ అని ఆర్మీ అధికారులు విశ్వసిస్తున్నారు.