చెన్నై: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) విగ్రహంపై కాషాయ శాలువా వేశారు. దీనిని గమనించిన ఆ పార్టీ నిరసనల బాటపట్టింది. మదురైలోని మద్రాస్ హైకోర్ట్ బెంచ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఉన్న ఎంజీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ కండువా అయిన కాషాయ శాలువా వేశారు. మంగళవారం దీనిని గమనించిన అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు. అలాగే దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎంజీఆర్ విగ్రహాన్ని కాషాయమయం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎంజీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆ విగ్రహంపై ఉన్న కాషాయ శాలువాను తొలగించారు. బీజేపీ, దాని అనుబంధ హిందూ సంస్థలు వినియోగించే కాషాయ శాలువాను ఆ విగ్రహంపై ఎవరు వేశారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
కాగా, తమినాడులో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. తిరువల్లువర్, అన్నా, పెరియార్, అంబేద్కర్ విగ్రహాలకు కాషాయ కండువాలు కప్పడంపై పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమయ్యాయి.