Agusta Westland Cases | క్రిస్టియన్ మైఖేల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిరాకరించింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో క్రిస్టియన్ మిచెల్ మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. రూ.36 వేల కోట్ల విలువైన 12 వీవీఐ హెలికాప్టర్ల కొనుగోలులో ఆయన పాత్రపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. 2018లో దుబాయి నుంచి ఆయనను భారత్కు తరలించిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది.
అయితే, గత ఐదేళ్లుగా మైఖేల్ జైలులో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది అల్జో జోసెఫ్ వాదనలు వినిపించారు. నేరం రుజువైతే అతనికి విధించే గరిష్ఠ శిక్షణ సైతం ఇదే కావొచ్చన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు సైతం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేసులో గరిష్ఠ శిక్షను ఇప్పటికే అనుభవించినందుకు ఆయనను విడుదల చేయాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మైఖేల్ కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సీజేఐ తెలిపారు. 2022 మార్చి 11న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. 2021లో కింది కోర్టు ఈ కేసుల్లో బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.