న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులను తీవ్ర నిరుత్సాహపరిచింది. బుధవారం పార్లమెంటుకు సమర్పించిన 2023-24 వార్షిక బడ్జెట్లో వ్యవసాయరంగానికి గతంలో మాదిరిగానే కేటాయింపులను మమ అనిపించింది. వ్యవసాయోత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పిస్తుందేమోనని ఎంతో ఆశగా ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. ఎమ్మెస్పీకి చట్టబద్ధతపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. అప్పులిస్తాం తీసుకోండి.. అష్టకష్టాలు పడైనా తీర్చేయండి అన్నట్టుగా కేంద్ర బడ్జెట్ ఉన్నదని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారి రూ.60 వేల కోట్లే కేటాయించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి ఇవే అతి తక్కువ కేటాయింపులు. వ్యవసాయరంగానికి అత్యంత కీలకమైన ఎరువుల సబ్సిడీ నిధులను ఏకంగా 31 శాతం తగ్గించింది.
వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం రైతులకు రూ.20 లక్షల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ప్రతిపాదించింది. 2022-23లో రూ.18 లక్షల కోట్లు ప్రతిపాదించగా, ఈ ఏడాది రూ.2 లక్షల కోట్లు పెంచింది. వ్యవసాయరంగంలో పశు సంవర్ధక, డెయిరీ, ఫిషరీస్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. మత్స్య సంపద పెంపు, మార్కెట్ల విస్తరణ కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. దీనికోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచే లక్ష్యంతో రొయ్యల ఆహార పదార్థాల దిగుమతులపై కస్టమ్స్ పన్నును తగ్గించాలని ప్రతిపాదించారు.
చేపలు, రొయ్యల వంటి సముద్ర ఉత్పత్తులకు పర్యావరణ హిత, నాణ్యమైన సూక్ష్మ పోషకాలను సరఫరా చేసే లక్ష్యంతో జాతీయస్థాయిలో సరఫరా నెట్వర్క్ను ఏర్పాటుచేసేందుకు 10 వేల బయో రిసోర్స్ సెంటర్స్ను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించి, సహజ ఎరువుల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో పీఎం ప్రణామ్ పథకం ద్వారా రాష్ర్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారు. కానీ, అవి ఎలా ఇస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అధికంగా పంటలు పండించే తెలంగాణ వంటి రాష్ర్టాల్లో కృత్రిమ ఎరువుల వాడకం అనివార్యం. కేంద్రం ఒకవైపు ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ, సహజ ఎరువులను వాడాలని సూచిస్తుండటంతో రైతులు గందరగోళంలో పడుతున్నారు. తోట పంటలకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్టు విత్తమంత్రి తెలిపారు. ఈ పథకానికి రూ.2,200 కోట్లు కేటాయించారు.
సాగులో టెక్నాలజీ
వ్యవసాయరంగంలో స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇచ్చేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. ‘శ్రీ అన్న’ పేరుతో తృణధాన్యాల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి ప్రపంచానికి భారత్ను తృణధాన్యాల కేంద్రంగా మారుస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేస్తారు. అయితే ఈ పంటలకు మద్దతు ధరల పెంపు విషయంలో మాత్రం బడ్జెట్లో స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.
ఊరట ఏది?
కేంద్ర బడ్జెట్లో రైతుకు కేంద్రం ఏమాత్రం ఊరట ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏమైనా వరాలు ఉంటాయేమోనన్న అన్నదాత ఆశలు అడియాశలే అయ్యాయి. వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ వాటికి వడ్డీ సబ్సిడీని మాత్రం పెంచలేదు. వ్యవసాయ రుణాలను బ్యాంకులు 9 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇందులో రెండుశాతం కేంద్రప్రభుత్వం సదరు బ్యాంకులకు చెల్లిస్తున్నది. మిగతా 7 శాతం వడ్డీని రైతులే తీర్చాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచాలని రైతు సంఘాలతోపాటు అనేక రాష్ర్టాలు కేంద్రాన్ని పదేపదే కోరాయి. కానీ, కేంద్రం ఈ విషయాన్ని కనీసం పట్టించుకోలేదని బడ్జెట్లో తేలిపోయింది.