న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొని అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పథకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. అయితే, ఈ క్రమంలో అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన అనంతరం జరుగుతున్న హింసాకాండపై మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన, సమర్థులైన అగ్నివీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. హింసాత్మక ఘటనలు తనకు బాధ కలిగించాయన్నారు.
అగ్నివీర్లు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారు విశిష్టంగా ఉపాధి పొందేలా చేస్తాయని, అలాంటి శిక్షణ పొందిన.. సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతించిందని ట్వీట్ చేశారు. కార్పొరేట్ రంగంలో అగ్నివీర్ల ఉపాధికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. భారత దేశ సైన్యాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 14న కేంద్ర రక్షణ శాఖ మంత్రి అగ్నిపథ్ స్కీమ్ను త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. అయితే, నాలుగు సంవత్సరాలు తర్వాత 25 శాతం మందిని అర్హత, ప్రతిభ ఆధారంగా మరో 15 సంవత్సరాల పాటు సైన్యంలో కొనసాగించనున్నారు.
అగ్నిపథ్ స్కీమ్లో చేరిన వారిని అగ్నివీర్లుగా పిలువనున్నారు. ఈ ఏడాది 46వేల మంది అగ్నివీర్లను నియమించుకోనున్నారు. సమీప భవిష్యత్లో ఇది 1.25లక్షలకు చేరనుందని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ పథకాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, అసోం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులను ధంసమయ్యాయి.
నిరసనల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. కొనసాగుతున్న ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 491 రైళ్ల సర్వీసులు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ స్కీమ్ను వెనక్కి తీసుకోబోయేది లేదని మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి ప్రకటించారు. పథకం కింద మొదటి బ్యాచ్ అగ్నివీర్ల రిక్రూట్మెంట్ కోసం ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, జూలై 24న పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదైన వారిని ఆర్మీ ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని చెప్పారు.