భోపాల్: కొందరు వ్యక్తులు రైలులో ఫొటోలు, వీడియోలు తీయడంపై ఒక వ్యక్తి, మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యక్తులు వారిపై దాడి చేసి కొట్టారు. ఈ గొడవ నేపథ్యంలో ఆ వ్యక్తి, మహిళ కదులుతున్న రైలు నుంచి పడిపోయారు (Fall Off Train). మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జార్ఖండ్కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి, బంధువైన 35 ఏళ్ల మహిళ బుధవారం సూరత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు. అయితే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు యువకులు ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో ఆ వ్యక్తి, మహిళ దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆ ముగ్గురు యువకులు జార్ఖండ్కు చెందిన వ్యక్తితోపాటు మహిళను కొట్టారు. గొడవ సందర్భంగా జరిగిన తోపులాటలో వారిద్దరూ కదులుతున్న రైలు నుంచి కిందపడ్డారు.
కాగా, ఒక వ్యక్తి, మహిళ రైలు పట్టాల వద్ద గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును రైల్వే పోలీసులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.