ఉగ్రవాదులు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో దోషిగా తేలిన యాసిన్ మాలిక్కు పాటియాలా కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెల్లడి కాగానే జమ్మూ కశ్మీర్లోని మైసూమా, డౌన్టౌన్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిలిపేసింది.
ఇంతకు ముందు యాసిన్ మాలిక్కు మద్దతుగా ఆయన మద్దతు దారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను వాడారు.
జమ్ముకశ్మీర్ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేత యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చింది. కేవలం యావజ్జీవ శిక్ష మాత్రమే కాదు.. 10 లక్షల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించింది. ”రెండు జీవిత ఖైదులతో పాటు.. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. వీటితో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు” అని న్యాయవాది ఉమేశ్ శర్మ ప్రకటించారు.