న్యూఢిల్లీ: ఇండిగో విమానం గాలిలో ఉండగా పైలట్ అస్వస్థత చెందారు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. అందులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు కొత్త సిబ్బందితో కూడిన మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. (IndiGo Pilot Falls Ill) గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఖతార్ రాజధాని దోహా నుంచి బెంగళూరు వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ అయ్యింది. అయితే దోహా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన రెండు గంటల తర్వాత ఆ విమానం గాలిలో ఉండగా ఒక పైలట్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ‘మేడే’ అని ప్రకటించారు.
కాగా, ఆ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. ఒమన్ రాజధాని మస్కట్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అక్కడ చిక్కుకున్న ప్రయాణికులను బెంగళూరు తరలించేందుకు ప్రత్యామ్నాయ విమానం, కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. తమ ప్రయాణికులు, సిబ్బంది, విమానం భద్రతకు అత్యంత ప్రాధాన్యత అని ఇండిగో ప్రకటించింది.