లక్నో: ఒక వ్యక్తి దళిత స్నేహితుడి చెవిపై మూత్ర విసర్జన చేశాడు (Man urinates on Dalit friend’s ear). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 11న జుగైల్ ప్రాంతానికి చెందిన స్నేహితులైన జవహర్ పటేల్, గులాబ్ కోల్ మద్యం సేవించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఫైట్ జరిగింది. ఈ నేపథ్యంలో దళిత ఫ్రెండ్ గులాబ్ కోల్ను జవహర్ పటేల్ కొట్టాడు. ఆపై అతడి చెవిపై మూత్ర విసర్జన చేశాడు. పటేల్ అనుచరుడు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నాడు.
కాగా, ఈ సంఘటనను ఒక వ్యక్తి మొబైల్ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. బాధిత దళిత వ్యక్తి గులాబ్ కోల్ మద్యం మత్తులో ఉన్నాడని, ఏం జరిగిందో తనకు తెలియదని అతడు చెప్పాడని అన్నారు. అయితే వీడియో ఆధారంగా ఈ సంఘటనపై ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జవహర్ పటేల్, అతడి అనుచరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో జరిగిన ఇలాంటి తరహా సంఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న గిరిజన వ్యక్తిపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేయడంతోపాటు అతడి ఇంటిని నేలమట్టం చేసింది. అలాగే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత గిరిజనుడు దశమత్ రావత్ కాళ్లు కడిగారు. అయితే వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి, సీఎం చౌహాన్ కాళ్లు కడిగిన వ్యక్తి వేరుగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.