న్యూఢిల్లీ : వివాదాస్పద చట్టం ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల), 1958 (ఏఎఫ్ఎస్పీఏ)’ అమలును నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో ఉపసంహరించే అవకాశముందని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ చెప్పారు. గువాహటిలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమలో ఆయన మాట్లాడుతూ, ఏడాది చివరినాటికి ఏఎఫ్ఎస్పీఏ చట్టం అమలును పూర్తిగా ఎత్తేసే దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మాజీ మిలటరీ సిబ్బందితో పోలీస్ బలగాలకు శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేపడతామన్నారు. ఏఎఫ్ఎస్పీఏ ప్రస్తుతం అస్సాంలోని 8జిల్లాల్లో అమలవుతున్నది. చట్టం అమల్లో ఉన్న ప్రాంతంలో ఎవరినైనా, ఎప్పుడైనా అరెస్టు చేసే అధికారం సైనిక బలగాలకు ఉంటుంది. సైనిక కాల్పుల్లో ఎవరైనా మరణిస్తే, అందుకు బాధ్యులైన సైనికులపై విచారణ జరపడానికి అవకాశం లేదు. ‘కల్లోలిత ప్రాంతం’గా పేర్కొంటూ 1960 నుంచి అస్సాంలో ఈ చట్టాన్ని కేంద్రం అమలుజేస్తున్నది. ఈనేపథ్యంలో సైనిక బలగాల కాల్పుల్లో ఎంతోమంది అమాయక పౌరులు చనిపోయారు. ఈ చట్టాన్ని ఎత్తేయాలని మానవహక్కుల కార్యకర్తలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు.