గుడామీ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్.. ఇది సింగపూర్ కేంద్రంగా పనిచేసే కంపెనీ. అదానీ ఎంటర్ప్రైజెస్ (పాతపేరు అదానీ ఎక్స్పోర్ట్స్) ఇది దేశంలోకెల్లా కుబేరుడైన గౌతమ్ అదానీ కంపెనీ.
అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం.. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకొన్న ప్రధాన కుంభకోణాల్లో ఒకటి. ఈ మూడింటికీ ఉన్న సంబంధం తాజాగా బయటపడింది. అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: అదానీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ 2002లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో లిస్ట్ అయ్యింది. ఆ సమయంలో గుడామీ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తనకు సంబంధించినదేనని అదానీ కంపెనీ స్పష్టంగా పేర్కొన్నది. కట్ చేస్తే.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2014లో.. అంటే నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి రాగానే అగస్టా వెస్ట్లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంపై దాఖలు చేసిన చార్జిషీట్లో గుడామీ ఇంటర్నేషనల్ పేరును స్పష్టంగా పేర్కొన్నది. 2017లో దాఖలు చేసిన రెండో చార్జిషీట్లో కూడా ఈ కంపెనీ పేరును చేర్చింది. ఆ తర్వాత దాఖలు చేసిన మూడో చార్జిషీట్లో మాత్రం ఆ కంపెనీ పేరు ఉన్నట్టుండి మాయమైంది.
అసలేం జరిగింది?
మనదేశంలో రాష్ట్రపతి, ప్రధాని వంటి ఉన్నతస్థాయి నేతలు ప్రయాణించేందుకు ఇటలీకి చెందిన అత్యాధునిక అగస్టా వెస్ట్లాండ్ ఏడబ్ల్యూ 101 హెలికాప్టర్లు కొనాలని 2010లో నాటి ప్రభుత్వం నిర్ణయించింది.డాలర్ల విలువైన 12 హెలికాప్టర్లు కొనేందుకు ఆ కంపెనీతో భారత రక్షణశాఖ ఒప్పందం చేసుకొన్నది. అయితే, ఈ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకొనేందుకు నాటి కేంద్రప్రభుత్వ పెద్దలు, రక్షణ శాఖ అధికారులకు భారీగా లంచాలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి. 2013 ఫిబ్రవరి 12న అగస్టా పేరెంట్ కంపెనీ ఫిన్మెకానికా సీఈవో గిసెప్పీ ఒరిసీని ఇటలీ పోలీసులు అరెస్టు చేయటంతో మనదేశంలో రాజకీయ దుమారం రేగటంతో ఆ మరుసటి రోజే భారత రక్షణమంత్రి ఏకే ఆంటోనీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ, ఈ కుంభకోణంలో అగస్టా కంపెనీ అధికారులతోపాటు గౌతమ్ ఖైతాన్ అనే వ్యక్తి కీలకపాత్ర పోషించినట్టు గుర్తించింది. కాంట్రాక్టుకోసం కోట్లకొద్ది డబ్బును లంచాలుగా ఇచ్చేందుకు కొన్ని కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్టు నిందితులు ఆధారాలు సృష్టించారు.
అందులో ఒకటే గుడామీ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్. ఈడీ నిర్వహించిన సోదాల్లో ఖైతాన్ వద్ద పనిచేసే ఉద్యోగి ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా ఈ కంపెనీ పేరు బయటకు వచ్చింది. లంచాల కోసం అగస్టా వెస్ట్లాండ్ కంపెనీ నుంచి ట్యునీషియా కేంద్రంగా పనిచేసే ఐడీఎస్ ట్యునీషియా కంపెనీకి 24,377,020 యూరోలు బదిలీ అయ్యాయి. అక్కడి నుంచి ఆ డబ్బు మారిషస్ చిరునామాతో ఉన్న ఖైతాన్ డొల్ల కంపెనీ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీ లిమిటెడ్కు వెళ్లాయి. అటునుంచి గుడామీతోపాటు మరో రెండు సింగపూర్ కంపెనీలకు దాదాపు 20 లక్షల యూరోలు బదిలీ అయ్యాయి. ఇంటర్స్టెల్లార్తో వ్యాపార లావాదేవీలు నిర్వహించినందుకు ఈ డబ్బు తమకు బదిలీ అయినట్టు ఈ కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్టు గుర్తించిన ఈడీ, మొదటి రెండు చార్జ్షీట్లలో స్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొన్నది.
మూడో చార్జ్షీట్లో గుడామీ పేరు మాయం
ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తూ 2018లో మూడో చార్జిషీట్ (అదనపు) కోర్టులో దాఖలు చేసింది. అంతకుముందు 2017 నవంబర్లో గుడామీ కంపెనీ వివరాలివ్వాలని సింగపూర్ ప్రభుత్వానికి ఈడీ లెటర్ రొగేటరీ (ఎల్ఆర్) పంపింది. అయితే, ఆ కంపెనీ తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహించటంలేదని, కంపెనీ లైసెన్సుకు కూడా రద్దుచేశామని సింగపూర్ ప్రభుత్వం ప్రత్యుత్తరం ఇచ్చింది. దాని ఆధారంగా ఈడీ ఆ కంపెనీ పేరును మూడో చార్జ్షీట్ నుంచి తొలగించింది. దీంతో ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఖైతాన్ భారత రితు ఖైతాన్పై అభియోగాలు తేలిపోయాయని హిండెన్బర్గ్ తన రిపోర్టులో పేర్కొన్నది. గుడామీ కంపెనీ పేరును చార్జ్షీట్ నుంచి తొలగించటంపై ఈడీ ఇప్పుడు నోరు మెదపకపోవటం గమనార్హం.
గుడామీపై 2005లోనూ దర్యాప్తు
గుడామీ కంపెనీ చరిత్ర మొత్తం అనుమానాలతోనే కూడుకొని ఉన్నది. వజ్రాల దిగుమతిపై కస్టమ్స్ పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ కంపెనీపై 2005లోనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు నిర్వహించిందని అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్బర్గ్ రూపొందించిన నివేదికలో వెల్లడించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరిస్తూ విచిత్రమైన సమాధానం చెప్పింది. ‘పై రెండు అంశాలు (కస్టమ్ పన్ను ఎగవేత, అగస్టా కుంభకోణం) ఏనాడో ముగిసిన అధ్యాయాలు. ఆ కేసుల్లో మాకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చాయి. ఈ విషయాన్ని మేమే బహిర్గతం చేశాం. దీని గురించి మా కంపెనీ భాగస్వాములకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ విషయాలను మళ్లీ అబద్ధాలతో అల్లి ప్రపంచం ముందుకు తెచ్చారు’ అని ప్రకటించింది.
రెండు కంపెనీల్లో డైరెక్టర్లు సేమ్
అదానీ గ్లోబల్ లిమిటెడ్ (అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్), గుడామీ ఇంటర్నేషనల్ కంపెనీల్లో వాటాదారులుగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కొందరి పేర్లు కామన్గా ఉన్నాయి. గుడామీ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన చాంగ్ చుంగ్ లింగ్ అదానీ గ్రూప్లోని ఇతర కంపెనీల్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. సింగపూర్లో అదానీ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయం చిరునామా, చాంగ్చుంగ్ లింగ్ నివాసం ఒకటే. మరో డైరెక్టర్ వినోద్ శాంతిలాల్ షా చిరునామా కూడా అదే కావటం విశేషం. ఈయన గౌతమ్ అదానీ అన్నయ్య. గత ఐదేండ్లలో వినోద్ శాంతిలాల్ షా ఆస్తులు అసాధారణ స్థాయిలో 850 శాతం పెరిగాయి. ప్రవాస భారతీయుల్లో ఈయనే అత్యంత సంపన్నుడని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ -2022ను ఉటంకిస్తూ ఎన్డీటీడీ 2022 సెప్టెంబర్లో రిపోర్ట్ చేసింది. అప్పటికే ఆయన ఆస్తులు రూ.1.69 లక్షల కోట్లు. మొత్తంగా అత్యంత ధనవంతులైన భారతీయుల్లో షాది ఆరో స్థానం.
అదానీ గ్రూప్పై సుప్రీంలో మరో పిటిషన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని స్వాహా చేసిన ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. అదానీ ఎంటర్ప్రైజెస్లో ఎల్ఐసీ, ఎస్బీఐలు పెట్టుబడులు పెట్టడంపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ ధర ప్రకారం ఒక్కో షేర్ రూ.1800 విలువ కలిగి ఉన్నప్పుడు ఈ రెండు సంస్థలు ఒక్కో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ను రూ.3,200 పెట్టి కొనుగోలు చేశాయని ఆరోపించారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 17న వాటి విచారణ జరగనుంది.