న్యూఢిల్లీ, జనవరి 25: తమ గ్రూప్ సంస్థ నుంచి జారీ అవుతున్న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను దెబ్బతీసేందుకే అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ దురుద్దేశంతో రిసెర్చ్ నివేదికను విడుదల చేసిదంటూ అదానీ గ్రూప్ ఆరోపించింది. తమ వివరణ తీసుకోకుండా, వాస్తవాల్ని సరిచూడకుండా తప్పుడు సమాచారాన్ని క్రోడీకరించి రిపోర్ట్ తయారుచేశారని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేశిందర్ సింగ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భారత హైకోర్టులు తిరస్కరించిన నిరాధార ఆరోపణల్ని రిపోర్ట్లో పొందుపర్చారన్నారు.
అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి జారీ అవుతున్న దేశంలోకెల్లా అతిపెద్ద ఎఫ్పీవోను దెబ్బతీసే ఏకైక లక్ష్యంతో.. ఆఫర్ జారీచేస్తున్న సమయంలోనే అదానీ గ్రూప్ ప్రతిష్ఠకు భంగం కలిగే రిపోర్ట్ను హిండెన్బర్గ్ ప్రచురించిందని సింగ్ పేర్కొన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీవో ఈ నెల 27న ప్రారంభంకానున్నది. అదానీ గ్రూప్ కంపెనీల్లో తమకు షార్ట్ పొజిషన్లు (షేర్లు లేదా బాండ్ల ధరలు తగ్గుతాయన్న అంచనాలతో తీసుకునే ట్రేడింగ్ పొజిషన్లు) ఉన్నాయని హిండెన్బర్గ్ వెల్లడించింది. ఈ షార్ట్ పొజిషన్లు అమెరికాలో ట్రేడయ్యే బాండ్లు, భారతేతర ట్రేడెడ్ డెరివేటివ్స్, ఇతర భారతేతర ట్రేడెడ్ రిఫరెన్స్ సెక్యూరిటీల్లో ఉన్నాయన్నది.