ముంబై, నవంబర్ 29: ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారావిలో రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకొన్నది. మొత్తం ముగ్గురు బిడ్డర్లలో అత్యధికంగా రూ.5,069 కోట్ల బిడ్ దాఖలు చేయటంతో ఆ ప్రాజెక్టుకు అదానీకే దక్కినట్టు మహారాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి. డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. మూడో బిడ్డర్ నమన్ గ్రూప్ బిడ్కు అర్హత సాధించలేకపోయింది. తుది అనుమతి కోసం బిడ్ వివరాలను ప్రభుత్వానికి పంపుతామని ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, 2.5 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉన్న ధారావి ప్రాంత అభివృద్ధి మొత్తం ప్రాజెక్టు విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా అక్కడ నివసిస్తున్న 6.5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టాలి. ఇల్లు సహా ప్రజలకు కావాల్సిన మౌలిక, ఇతర సౌకర్యాలు కల్పించాలి.