భోపాల్: బాలికలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు దళిత వ్యక్తులను (Dalit men thrashed) ముస్లిం కుటుంబీకులు కొట్టారు. వారి మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. అంతేగాక దళిత వ్యక్తులతో బలవంతంగా మురికిని తినిపించారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాలికలను వేధిస్తున్నారని, రహస్యంగా వీడియో తీశారంటూ ఇద్దరు దళిత వ్యక్తులపై ముస్లిం వ్యక్తులు ఆరోపించారు. వారిని పట్టుకుని కొట్టారు. దళిత వ్యక్తుల ముఖానికి నల్ల రంగు పూశారు. మెడలో చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. అలాగే వారితో బలవంతంగా మురికిగా ఉన్న బురదను తినిపించారు.
కాగా, జూన్ 30న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై స్పందించారు. దళిత వ్యక్తులను కొట్టడంపై ఆరా తీశారు. అయితే వారిపై చేసిన ఆరోపణలు తప్పని దర్యాప్తులో తేలింది. కొందరు బాలికలతో వారు మొబైల్ ఫోన్లో మాట్లాడారని, వారు ఎప్పుడూ కూడా బాలికలు ఉన్న గ్రామానికి వెళ్లి వారిని కలువలేదని పోలీసులు తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలతో కొట్టడం, అవమానించడంపై దళిత వ్యక్తుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ముస్లిం కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై ఎస్సీఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అలాగే అటవీ భూమిలో ఉన్న నిందితుల ఇంటిని నేలమట్టం చేసినట్లు వెల్లడించారు.