AAP | న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని ఐటీవో జంక్షన్ వద్ద ఆందోళనకు దిగిన ఆప్ మంత్రులు అతిశీ, సౌరవ్ భరద్వాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ను కూడా అదుపులోకి తీసుకొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 26న ప్రధాని మోదీ నివాసం ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది. ఢిల్లీ ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 23న (శనివారం) ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తామని, 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తామని, 25న తమ పార్టీ హోలీ పండుగను జరుపుకోబోదని తెలిపారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొన్నదని ఆప్ నేత సందీప్ పాఠక్ విమర్శించారు. బెంగళూరులో ఆప్ కార్యకర్తలు ‘బ్లాక్ డే’ పాటించారు. ముంబైలో తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారని మహారాష్ట్ర ఆప్ అధ్యక్షుడు ప్రీతి శర్మ మీనన్ పేర్కొన్నారు. శ్రీనగర్లో ఆప్ కార్యకర్తల మార్చ్ను పోలీసులు అడ్డుకొన్నారు. కోల్కతాలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకొన్నది. హర్యానాలోని కురుక్షేత్రలో సీఎం నాయబ్ సింగ్ సైనీ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆప్ కార్యకర్తలపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించడంతోపాటు లాఠీచార్జి చేశారు.
కేజ్రీవాల్ అరెస్టును విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దర్యాప్తు సంస్థలు సెలక్షన్ విధానంలో విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొన్నాయని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న విపక్ష నేతల అరెస్టులపై త్వరలో ఈసీని కలుస్తామని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమత పేర్కొన్నారు. విపక్ష కూటమిని చూసి మోదీ, అమిత్షాలు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. మోదీ సర్కార్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత పట్ల బీజేపీ ఆందోళన చెందుతున్నదని, అందుకే విపక్షాలపై దాడులు చేయిస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో పేర్కొన్నది. విపక్షం లేకుండా చేయాలని అధికార బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార దుర్వినియోగానికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పష్టం చేశారు. బీజేపీకి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు. కాగా, మద్యం పాలసీ అంశాలకు దూరంగా ఉండాలని తాను కేజ్రీవాల్ను గతంలో హెచ్చరించానని, అయితే అతని పనుల కారణంగా తను అరెస్టు అయ్యారని సామాజిక కార్యకర్త అన్నాహజారే వ్యాఖ్యానించారు.
మోదీది అధికార అహంకారం: సునీతా కేజ్రీవాల్
మోదీది అధికార అహంకారమని ఆరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. భర్త అరెస్టుపై ఆమె స్పందించారు. మూడుసార్లు ఢిల్లీ సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ను అరెస్టు చేయించారని, ఇది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ‘మీ సీఎం జైల్లో ఉన్నా, బయట ఉన్నా మీ కోసం నిలబడుతారు. ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు’ అని ఎక్స్లో పోస్టు చేశారు.
జైల్లో ఉన్నా దేశసేవకే అంకితం: అరవింద్ కేజ్రీవాల్
‘ఈ దేశానికి సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేశా. జైల్లో ఉన్నా.. బయట ఉన్నా నా సేవను కొనసాగిస్తా’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ఢిల్లీలో శుక్రవారం రౌస్ఎవెన్యూ కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం పదవికి తాను రాజీనామా చేయబోనని, జైలు నుంచే పాలన సాగిస్తానని తేల్చిచెప్పారు.