UP Elections : ఉత్తర ప్రదేశ్లో కొత్త పొత్తు దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశాన్ని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పరిశీలిస్తున్నాయి. ఈ అంశంపై చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ను యూపీలోని లక్నోలో ఆదివారం కలిశారు.
యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అక్కడ అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు పొత్తుల దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఎంఐఎం కూడా ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో పొత్తు పెట్టుకోవడం ద్వారానే బీజేపీని ఎదుర్కోవచ్చనే ఆలోచన చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఎస్పీ, ఆప్ మధ్య చర్చలు ఆదివారం జరిగాయి. సంజయ్ సింగ్, అఖిలేష్ ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ప్రస్తుతానికి ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో 15-20 సీట్లు కావాలని అడుగుతోంది. దీనికి అఖిలేష్ ఇంకా ఎలాంటి అంగీకారం తెలపలేదు. అఖిలేష్తో భేటీ అనంతరం ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. యూపీలో అమలవుతున్న విద్యా విధానాన్ని తప్పుబట్టారు. జౌన్పూర్లోని ఐదు స్కూళ్లు ఖాళీగా ఉన్నాయని, కనిపించడం లేదని అన్నారు. ఆ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో చెబితే తన వేతనం నుంచి రూ.1 లక్ష ఇస్తానని ప్రకటించారు.
మరోవైపు కాంగ్రెస్తో పొత్తు అంశాన్ని కూడా అఖిలేష్ యాదవ్ పరిశీలిస్తున్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇటు అఖిలేష్ పొత్తు విషయంలో సానుకూలంగానే ఉన్నారు. కానీ, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.