న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుత్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నదని అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ గత ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాదాపు 3 వేల మంది విపక్ష పార్టీల నేతలపై దాడులు చేసిందని పేర్కొన్నారు.
అయితే 23 మందిని మాత్రమే పలు కేసుల్లో దోషులుగా తేల్చిందని, నేర నిరూపణ 0.5 శాతంగా మాత్రమే ఉన్నదని అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వంటి నేతలపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు. పరారీలో ఉన్న నీరవ్ మోదీ మనీలాండరింగ్కు పాల్పడినట్టు తేలితే.. ఈడీ ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. నీరవ్ మోదీ, విజయ్మాల్యా, లలిత్ మోదీ, రెడ్డి బ్రదర్స్, యెడియూరప్ప వంటి దోపిడీదారులపై సీబీఐ, ఈడీ వంటి సంస్థల నుంచి ఎటువంటి చర్యలు ఉండవని అన్నారు. ‘మీతో సంబంధం ఉన్న అవినీతిపరులపై చర్యలు ఎందుకు లేవు?’ అని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలుపడంతో.. ఆధారాలు, నిరూపణ లేని వ్యాఖ్యలు చేసేందుకు సభ్యులను సభ ఆనుమతించదని, అలాచేస్తే హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ పేర్కొన్నారు.