AAP MLA | చండీఘర్ : పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆప్ ఎమ్మెల్యే కరంబీర్ సింగ్తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆప్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఘోగ్రా గ్రామానికి సమీపంలో ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కరంబీర్ హోషియాపూర్ జిల్లాలోని దసుయా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎమ్మెల్యే తల్వారా పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు శుభం, గన్మెన్ అమృత్ దీప్ సింగ్, డ్రైవర్ జస్సా సింగ్, మరో వ్యక్తి దల్జీత్ సింగ్ గాయపడ్డారు. క్షతగాత్రులను దసుయాలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేతో పాటు మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.