Aaftab Poonawala | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాల్కర్ హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు ఢిల్లీలోని రోహిణిలోగల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అతడు విస్తుగొల్పే వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శ్రద్ధాను తానే హత్య చేసినట్లు అంగీకరించిన ఆఫ్తాబ్.. ఆమెను చంపినందుకు తానేమీ బాధపడట్లేదని వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు సమాచారం. పాలీగ్రాఫ్ పరీక్షలో ఆఫ్తాబ్ ప్రవర్తన చాలా సాధరణంగా ఉందని.. శ్రద్ధా హత్యకు సంబంధించి అన్ని వివరాలు ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఈ టెస్టుకు సంబంధించి తుది నివేదిక ఇంకా రాలేదు. నార్కో టెస్ట్ తర్వాతే పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, అతడికి నార్కో టెస్టు జరిపేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు.. డిసెంబరు 1 లేదా 5వ తేదీల్లో టెస్టులు నిర్వహించనున్నారు. ఇక ఈ కేసులో శ్రద్ధా డీఎన్ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు కూడా ఇంకా రావాల్సి ఉంది.
సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల శ్రద్ధా వాల్కర్ను 28 ఏళ్ల ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అత్యంత క్రూరంగా చంపిన విషయం తెలిసిందే. లవర్ను 35 ముక్కలు చేసి.. ఫ్రిడ్జ్లో దాచి.. ఆ తర్వాత ఆమె శరీరా భాగాలను ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో పడేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.