న్యూఢిల్లీ, ఆగస్టు 26: అభం శుభం తెలియని చిన్నారుల్లో కూడా మత జాడ్యాన్ని నూరిపోసే ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్నది. ముజఫర్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న ఓ వర్గం బాలుడిని కొట్టాలంటూ ఇతర విద్యార్థులను టీచర్ ఆదేశించారు. దీంతో విద్యార్థులు ఆ బాలుడిని చెంపపై పదేపదే కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల్లో మతాన్ని నూరిపోయడమేంటని పలువురు విమర్శించారు. పోలీసులు మాట్లాడుతూ ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, టీచర్పై చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను కోరుతామని తెలిపారు. గుణకార పట్టికలు నేర్చుకోకపోవడంతో టీచర్ కొట్టాలని ఆదేశించారని బాధిత బాలుడు చెప్పాడు. దీంతో దాదాపు గంటసేపు కొట్టారని ఆదేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సదరు టీచర్ స్పందించారు. ‘నేను దివ్యాంగురాలిని. తప్పు చేసిన విద్యార్థిని దండించలేను. అందుకే విద్యార్థులను దండించాలని ఆదేశించాను. ఎటువంటి దురుద్దేశం లేదు’ ఆమె పేర్కొన్నారు.