న్యూఢిల్లీ, జూన్ 13: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సుమారు 10 గంటలు ప్రశ్నించింది. రెండు దఫాలుగా ఈ విచారణ జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.10 గంటల సమయంలో రాహుల్ చేరుకొన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. రెండున్నర గంటల విచారణ అనంతరం భోజన విరామం తీసుకున్న రాహుల్.. అనంతరం 3.30 గంటలకు ఈడీ కార్యాలయానికి మళ్లీ చేరుకున్నారు. రాహుల్ ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేసినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని రాహుల్కు ఈడీ సూచించింది.
రాహుల్ను ఈడీ విచారిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ సహా బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, గువాహటి, జమ్ము, డెహ్రాడూన్, జైపూర్ తదితర నగరాల్లో నిరసనలు చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, రణ్దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుంటున్నదని గెహ్లాట్ మండిపడ్డారు.
ఈడీ విచారణ జరుగుతుండగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు పెద్దయెత్తున నిరసనలకు దిగారు. పోలీసులు తోసివేయడంతో మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం కండ్లద్దాలు కిందపడ్డాయని, ఎడమ వైపు పక్కటెముకకు స్వల్ప గాయమైనట్టు సుర్జేవాలా తెలిపారు. భారీకాయంతో ఉన్న ముగ్గురు పోలీసులు తనను ఢీకొట్టారని, దీంతో కిందపడిపోయినట్టు చిదంబరం తెలిపారు.