జార్ఖండ్: నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలులో ఉన్నా కొన్ని మానవ మృగాలు వాటిని ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఏ భయమూ లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బాయ్ఫ్రెండ్తో కలిసి బైక్ రైడ్కు వెళ్లిన ఓ యువతిపై ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పదిమంది కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. సింగ్భమ్ జిల్లాకు చెందిన 26 ఏండ్ల యువతి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నది. గురువారం సాయంత్రం తన బాయ్ఫ్రెండ్తో కలిసి బైక్రైడ్కు వెళ్లింది. దారి మధ్యలో ఓ 10 మంది పోకిరీల గుంపు వారిని అడ్డగించింది. బాయ్ఫ్రెండ్ను చితకబాది పక్కన పడేసింది. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడింది.
ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి ఆమె పర్సు, మొబైల్ ఫోన్ తీసుకొని నిందితులు పారిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతికి స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.