బెంగళూరు, జూన్ 11: హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చౌకైన మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) యంత్రాన్ని తయారుచేసింది. ఇప్పుడు వినియోగంలో ఉన్న ఎంఆర్ఐ యంత్రాలతో పోలిస్తే దాదాపు 50 రెట్లు తక్కువ ధరకే దీన్ని తయారుచేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యంత్రం అందుబాటులోకి వస్తే ఎంఆర్ఐ స్కానింగ్ ధర కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యంత ఖరీదైన వైద్య పరీక్షల్లో ఎంఆర్ఐ స్కానింగ్ ఒకటి. గుండె, మెదడు, ఎముకల సంబంధ సమస్యలను తెలుసుకోవడానికి, క్యాన్సర్లను గుర్తించడానికి వైద్యులు ఎక్కువగా పేషెంట్లకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయిస్తారు.
ఎంఆర్ఐ చేయించడానికి దాదాపుగా రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు అవుతుంది. కొన్నిచోట్ల ఇంతకంటే తక్కువ ధరకు చేస్తున్నప్పటికీ ఇందుకోసం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ఎంఆర్ఐ పరీక్షకు ఇంత ఎక్కువ ధర ఉండటానికి ప్రధాన కారణం ఈ పరీక్ష చేసే యంత్రం ఖరీదైనది కావడమే. మన దేశంలో 3-టీ ఎంఆర్ఐ మెషీన్ ధర దాదాపుగా రూ.9 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఉంటుంది. దీనికి అవసరమైన సదుపాయాల కోసం మరింత ఖర్చు అవుతుంది. ఇంత భారీ ధర పెట్టి ఎంఆర్ఐ యంత్రం కొనుగోలు చేయడం వల్ల పరీక్షకు సైతం ఎక్కువగా ధర వసూలు చేస్తున్నారు.
ధర ఎక్కువగా ఉండటం వల్ల పేదలు అవసరమైనప్పుడు ఎంఆర్ఐ పరీక్ష చేయించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన హాంకాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త ఎంఆర్ఐ యంత్రాన్ని తయారుచేశారు. దీని ధర దాదాపు 22 వేల డాలర్లు ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఇది రూ.18.4 లక్షలు. తక్కువ సామర్థ్యం గల 0.05 టెస్లా(టీ) అయస్కాంతాలతో ఈ కొత్త ఎంఆర్ఐ యంత్రాన్ని తయారుచేశారు. సాధారణ ఎంఆర్ఐ యంత్రాన్ని ప్రత్యేక రక్షణ కలిగిన గదిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులోని అయస్కాంతాలను చల్లబరిచేందుకు లిక్విడ్ హీలియం వాడతారు. దీనికి విద్యుత్తు సదుపాయం కూడా వేరుగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ కొత్త ఎంఆర్ఐ యంత్రాన్ని మాత్రం సాధారణ గదిలోనే ఏర్పాటు చేయవచ్చని, దీనికి హీలియం కూలెంట్ అవసరం లేదని, మామూలు విద్యుత్తు ఔట్లెట్తోనే వినియోగించవచ్చని శాస్త్రవేత్త డాక్టర్ ఎడ్వూ తెలిపారు. దీని ధర తక్కువ అని, నిర్వహణ సులభమని, విద్యుత్తు వినియోగం కూడా తక్కువేనని తెలిపారు. అయితే, 3టీ ఎంఆర్ఐ యంత్రంతో పోలిస్తే ఈ 0.05టీ ఎంఆర్టీ యంత్రంలో ఇమేజ్ నాణ్యత తక్కువగా ఉంటుందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారంగా ఏఐని వినియోగిస్తున్నామని, ఏఐ ద్వారా ఇమేజ్ నాణ్యతను పెంచొచ్చని ఎడ్వూ చెప్తున్నారు.