న్యూఢిల్లీ : ఓ ఖైదీ దొంగచాటుగా మొబైల్ ఫోన్ సంపాదించాడు. దాంతో తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు జైలు అధికారులకు తెలిసింది. ఆ ఖైదీపై నిఘా పెట్టిన అధికారులు.. అతని బ్యారక్ వద్దకు వెళ్తుండగా.. ఆత్రుతతో మొబైల్ ఫోన్ను మింగేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని తీహార్ జైలు నంబర్ 1లో బుధవారం చోటు చేసుకున్నట్టు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ వెల్లడించారు.
మొబైల్ ఫోన్ మింగిన ఖైదీని చికిత్స నిమిత్తం దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఖైదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఖైదీ కడుపులోనే ఫోన్ ఉందని, దాన్ని బయటకు తీసేందుకు యత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.