Manipur Violence | ఇంఫాల్, జూలై 23: మణిపూర్లో చోటుచేసుకొన్న దారుణాల పరంపరంలో మరో అరాచకం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు సాయుధ వ్యక్తులు ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను ఇంట్లో బంధించి, సజీవ దహనం చేశారు. కాక్చింగ్ జిల్లాలోని సెరో గ్రామంలో మే 28న ఈ ఘోరం జరిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
బాధిత వృద్ధురాలు సోరోకైబాయ్ ఇబెటోంబికు 80 ఏండ్ల వయసు ఉంటుంది. ఆమె భర్త ఎస్ చురాచంద్ సింగ్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు పొందారు. కాగా, ఘర్షణల్లో సెరో గ్రామం నామరూపాల్లేకుండా పోయింది. తమ గ్రామంపైకి దాడికి వచ్చిన దుండుగులు.. ఇబెటోంబిని ఇంట్లో బంధించి, బయట గడియ పెట్టి, నిప్పు పెట్టారని ఆమె మనవడు ప్రేమ్కాంత్ పేర్కొన్నారు. మరోవైపు మే 15న తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని పేర్కొంటూ.. ఈస్ట్ ఇంఫాల్కు చెందిన ఓ 18 ఏండ్ల యువతి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది మహిళలు తనను నలుగురు సాయుధ వ్యక్తులకు అప్పగించారని అందులో ఆరోపించారు.