ఉజ్జయిని, మార్చి 25: ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వరుడి గుడిలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. హోలి సందర్భంగా గర్భ గుడిలో భస్మ హారతి ఇస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సహాయకులతో కలిపి మొత్తం 14 మంది పూజారులు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఘటన సమయంలో గర్భగుడి బయట పలువురు ప్రముఖులు, ఇతర భక్తులు ఉన్నారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్ నీరజ్కుమార్ సింగ్ వెల్లడించారు. కర్పూ రం ఉన్న పూజా పళ్లెంలో గులాల్ పడటం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడినవారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం, ఉచిత వైద్యం అందిస్తామని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. హోలి రంగుల వల్ల బాధితుల గాయాలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు.