న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) అధికార పీఠంపై ఆమ్ఆద్మీ పార్టీ పాగా వేయబోతున్నది. ఆదివారం జరిగిన MCD ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని భారీ విజయం వరించబోతున్నదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను దాదాపు సగానికిపైగా వార్డులను ఆప్ సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్పోల్స్ సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
NDTV పోల్స్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మొత్తం 250 వార్డుల్లో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ 155 స్థానాలు గెలుచుకుంటుంది. ఆజ్తక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ 149 నుంచి 171 వార్డుల్లో విజయం సాధించబోతున్నది. టైమ్స్ నౌ చేసిన మరో ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. 146 నుంచి 156 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయబోతున్నది.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా పాగా వేసిన బీజేపీ ఈసారి కేవలం 69 నుంచి 91 స్థానాలకే పరిమితమవుతుందని ఆజ్తక్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. అయితే, బీజేపీ 84 నుంచి 94 వార్డులను కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. ఇక, రెండు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని పేర్కొన్నాయి. ఆ పార్టీకి 10కి మించి వార్డులు దక్కడం అసాధ్యమని తెలిపాయి. ఇతరులకు 5 నుంచి 9 వార్డులు గెలుస్తారని వెల్లడించాయి.