ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నా ఓ వృద్ధురాలు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఆమెలో డెల్టా ప్లస్ రకం కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దాంతో ముంబైలో డెల్టా ప్లస్ రకం కరోనా వైరస్తో తొలి మరణం సంభవించినట్లయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల 21న ఓ 63 ఏండ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చింది.
అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా ఆమెకు మహమ్మారి సోకింది. కరోనా వైరస్కు తోడు అంతకుముందే ఆమె ఊపిరితిత్తులు, వాయునాళం సమస్యలతో కూడా బాధపడుతుండటంతో వ్యాధి తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గత నెల 27న వృద్ధురాలు మరణించింది. వృద్ధురాలు కాకుండా ఆమె కుటుంబంలో మరో ఆరుగురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు తేలింది. మరో నలుగురిలో ఉన్న వైరస్ రకం తేలాల్సి ఉన్నది.