రాంచీ : ఓ పసికందు పుట్టిన రెండు రోజులకే కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. కడుపంతా ఉబ్బిపోవడంతో తీవ్రంగా ఆయాస పడింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ పసిపాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సిటీ స్కాన్ చేసి కడుపులో కణితులు ఉన్నట్లు తేల్చారు. కానీ శస్త్ర చికిత్స చేయగా, అవి కణితులు కాదు.. పిండాలు అని నిర్ధారించారు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రామ్గర్హ్కు చెందిన ఓ గర్భిణికి నెలలు నిండడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన చేరింది. అదే రోజు పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత పసిపాప కడుపునొప్పితో బాధపడటాన్ని తల్లిదండ్రులు గమనించారు. కడుపు అంతా ఉబ్బిపోవడంతో వైద్యులను సంప్రదించారు. కడుపులో కణితులు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. తక్షణమే చికిత్స చేయించాలని రాంచీలోని రాణి హాస్పిటల్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
దీంతో తల్లిదండ్రులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాణి ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ పరీక్షలు నిర్వహించారు. మెడిసిన్స్ ఇచ్చి అబ్జర్వేషన్లో ఉంచారు. 21 రోజుల తర్వాత అంటే నవంబర్ 1న పాపకు గంటన్నర పాటు శస్త్ర చికిత్స నిర్వహించారు. పసికందు కడుపులో ఉన్న 8 పిండాలను తొలగించారు వైద్యులు. సర్జరీ విజయవంతమైంది. మరో వారం రోజుల్లో పాపను డిశ్చార్జి చేస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు చోటు చేసుకోవడం చాలా అరుదు అని డాక్టర్ ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే ఒకట్రెండు పిండాల వరకు కేసులు చూశాం. కానీ 8 పిండాలు ఉండటం ఇదే ప్రపంచంలో తొలి కేసు అని డాక్టర్ తెలిపారు.