Advocates Letter to CJI | ఇటీవల ఢిల్లీ, హరిద్వార్ల్లో జరిగిన అధ్యాత్మిక సదస్సుల్లో జాతి నిర్మూలనకు ఇచ్చిన పిలుపులపై సుమోటోగా కేసు స్వీకరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు 76 మంది సీనియర్ అడ్వకేట్లు లేఖ రాశారు. ఈ పిలుపులకు వ్యతిరేకంగా పోలీసులు చర్య తీసుకోనందున న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హరిద్వార్, ఢిల్లీ సదస్సుల్లో పాల్గొన్న వక్తలు కేవలం ద్వేషపూరిత ప్రసంగాలకు పరిమితం కాకుండా మొత్తం జాతి హత్యకు బహిరంగంగా పిలుపునిచ్చారని వారు గుర్తు చేశారు.
ఇది దేశ ఐక్యత, సమగ్రతకు మాత్రమే కాక లక్షల మంది ముస్లిం పౌరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లేఖపై సంతకాలు చేసిన న్యాయవాదుల్లో దుష్యంత్ దవె, ప్రశాంత్ భూషణ్, వృందా గ్రోవర్, సల్మాన్ ఖుర్షీద్, పాట్నా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
ముస్లింలకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకుని సామూహిక హత్యకాండకు పాల్పడాలని ఇచ్చిన పిలుపుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఖండనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాతే హరిద్వార్ సదస్సుపై ఒక పోలీసు కేసు నమోదైందని, అది కూడా ఒకరి పేరు చేర్చారని గుర్తు చేశారు. తర్వాత మరో ఇద్దరి పేర్లు జోడించారని తెలిపారు.