న్యూఢిల్లీ, ఆగస్టు 9: కేంద్ర ప్రభుత్వ శాఖలు, సివిల్ సర్వీసెస్లో పనిచేసే మహిళలు, ఒంటరి పురుష ఉద్యోగులు పిల్లల సంరక్షణ కోసం తమ మొత్తం సర్వీసులో 730 రోజులు సెలవులు (సీసీఎల్) తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో బుధవారం వెల్లడించారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972లోని రూల్ 43 సీ ప్రకారం వారు సెలవులు తీసుకొనేందుకు అర్హులని తెలిపారు. ఉద్యోగుల పిల్లల్లో ఇద్దరు తొలి సంతానానికి 18 ఏండ్ల వయసు వచ్చేవరకు ఈ అర్హత ఉంటుందని పేర్కొన్నారు. దివ్యాంగుల పిల్లల విషయంలో ఎలాంటి వయసు పరిమితి లేదని వెల్లడించారు.