రాయ్పూర్: ఒక వృద్ధుడు మూడు దశాబ్దాలుగా 300కుపైగా లగ్జరీ హోటల్స్లో బస చేశాడు. అయితే బిల్లులు చెల్లించకుండా పారిపోయేవాడు. చార్లెస్ సోభరాజ్ స్ఫూర్తితో ఈ మోసాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తిని చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. (defrauded luxury hotels) తమిళనాడుకు చెందిన 69 ఏళ్ల బింగ్సన్ జాన్, గత 36 ఏళ్లలో దేశవ్యాప్తంగా 300కు పైగా లగ్జరీ హోటళ్లను మోసగించాడు. విదేశీ టూర్ గైడ్, ఇంగ్లీష్ టీచర్, యోగా ఇన్స్ట్రక్టర్గా హోటల్ సిబ్బందిని నమ్మించేవాడు. లగ్జరీ, ప్రీమియం హోటల్స్లో విలాసవంతమైన వసతి, ఇతర సేవలు పొందిన తర్వాత బిల్లులు చెల్లించకుండా వెళ్లిపోయేవాడు. కొన్నిసార్లు హోటల్స్లోని వస్తువులను కూడా దొంగిలించినట్లు ఆరోపణలున్నాయి.
కాగా, జూన్ 25న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఫైవ్ స్టార్ హయత్ హోటల్లో జాన్ తాజాగా బస చేశాడు. జూన్ 27న ఉదయం వేళ చెక్ అవుట్ చేయకుండానే వెళ్లిపోయాడు. రూ. 63,755 బిల్లు చెల్లించకపోవడంతో పాటు అతడి అభ్యర్థన మేరకు హోటల్ సిబ్బంది ఇచ్చిన రూ.1.48 లక్షల విలువైన ల్యాప్టాప్ను కూడా తన వెంట తీసుకెళ్లాడు. హోటల్ సిబ్బంది జాన్ను సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు రాయ్పూర్ పోలీసులు జాన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిందితుడు ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. అక్కడకు వెళ్లి జాన్ను అరెస్ట్ చేశారు. హోటల్కు చెందిన ల్యాప్టాప్ను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అయితే రాయ్పూర్ పోలీసులు జాన్ను ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ స్ఫూర్తితో విలాసవంతమైన హోటల్స్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు. 1990 నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా హోటల్స్లో బస చేసి బిల్లులు చెల్లించకుండా మోసగించినట్లు చెప్పాడు. ఇది తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.
దేశంలోని పలు మహా నగరాలతో సహా 10కు పైగా రాష్ట్రాల్లో జాన్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. తీహార్ జైలుతో సహా పలు జైళ్లలో 15 ఏళ్లకు పైగా అతడు ఉన్నట్లు చెప్పాడు. పలువురు నేరస్థులతో పరిచయాలు కూడా జాన్ ఏర్పరచుకున్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. అతడి నేరాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.