గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దు వివాదం మరోసారి రాజుకున్నది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణ, కాల్పుల్లో ఆరు పోలీసులు మరణించారు. అస్సాం కాచర్ జిల్లా, మిజోరాం కోలాసిబ్ జిల్లా సరిహద్దులోని వివాదస్పద ప్రాంతంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆరు గుడెసెలకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత వాసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరారు. కర్రలు, ఇనుప రాడ్లతో హంగామా చేసి కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు, సరిహద్దు ప్రాంత వాసుల మధ్య ఘర్షణ జరిగి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఆరుగురు అస్సాం పోలీస్ అధికారులు చనిపోగా మరి కొందరు గాయపడ్డారు.
మరోవైపు సరిహద్దులోని వివాదస్పద ప్రాంతంలో సోమవారం జరిగిన అల్లర్లు, ఘర్షణపై ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం ఆరోపించుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని ఒకరికొకరు సూచించుకున్నారు. మిజోరం సీఎం జోరంతాంగ కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇటీవల రెండు రోజుల పాటు మిజోరంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు సమస్యను అస్సాం, మిజోరం సీఎంలు కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన పర్యటన ముగిసిన మరునాడే సరిహద్దులోని వివాదస్పద ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫోన్లో ఇరు సీఎంలతో మాట్లాడిన అమిత్ షా ఇరువైపులా పోలీస్ బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పారు.