న్యూఢిల్లీ : 5జీ సేవలు నిలిపివేయాలని, సింగిల్ జడ్జి తీర్పుపై విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన రూ.20లక్షల జరిమానాను రూ.2లక్షలకు తగ్గించేందుకు ప్రతిపాదించింది. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోసం కొంత సామాజిక సేవ చేయాలని షరతు విధించింది. జస్టిస్ విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. 5జీ ట్రయల్స్ను నిలిపివేయాలని జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పబ్లిసిటీ కోసం పిటిషన్ వేసినట్లుగా ఉందంటూ ఆమెకు రూ.20లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయగా.. సింగిల్ బెంచ్ విధించిన జరిమానాను పూర్తిగా తొలగించలేమని జూహీచావ్లా తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్కు కోర్టు తెలిపింది. రూ.20లక్షల నుంచి రూ.2లక్షల తగ్గించేందుకు ప్రతిపాదించిన కోర్టు.. ఆమె సెలెబ్రిటీ అయినందున సామాజిక సేవ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు జుహీ చావ్లాను సంప్రదించవచ్చని పేర్కొంది. ఇందుకు జూహీచావ్లా సైతం అంగీకరించారు. ఈ మేరకు ఢిల్లీ సర్వీసెస్ లీగల్ అథారిటీ కార్యదర్శి కన్వల్జిత్ అరోరాకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. అభిప్రాయం తెలుపాలని ఆదేశించింది.