‘సమకాలీన అంశాలతో యువతరం మనోభావాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమిది. నిజజీవితంలో నేను చూసిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించా’ అని అన్నారు లక్ష్మణ్ మేనేని. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యాడ్’. మాధవ్, రజత్ రాఘవ్, స్పందన, శ్వేతవర్మ నాయకానాయికలుగా నటించారు. టి. వేణుగోపాల్రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని సినిమా గురించి ముచ్చటించారు..
వైవాహిక బంధం, సహజీవనం, స్నేహం అంశాలను చర్చిస్తూ రెండు జంటల కథతో రూపొందిన చిత్రమిది. బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా జీవితాల్ని గడిపే ఇద్దరు అబ్బాయిలు, జీవితం పట్ల నిర్దిష్ట లక్ష్యాలున్న అమ్మాయిల మధ్య మొదలైన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నేటితరంలో భార్యాభర్తల బంధంలో స్వచ్ఛత, నిజాయితీ లోపిస్తూ కృత్రిమత్వం కనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగినప్పుడే వైవాహిక జీవితం నిలబడుతుందని చూపించాం. సరైన అవగాహన లేకుండా పెళ్లిచేసుకున్న యువ జంటలు ఎలా విడిపోతున్నారో నిజజీవితంలో గమనించా. అలాగే సహజీవనం పేరుతో యువతలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుంది రిలేషన్షిప్ డెవలప్ కావడం లేదు. నేను చూసిన సంఘటనలతో ఈ కథ రాసుకున్నా. స్క్రీన్ప్లే ప్రధానంగా వేగంగా ఈ సినిమా సాగుతుంది.
2018లో నిర్ణయించుకున్నా..
ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో సినిమాల పట్ల ఆసక్తి మొదలైంది. చదువు పూర్తయిన తర్వాత ఓ ఐటీ సంస్థను స్థాపించా. 2018లో సినిమా చేయాలనే ఆలోచన మొదలైంది. సినిమాల పట్ల నాకున్న స్వీయపరిజ్ఞానంతోనే తెరకెక్కించా. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు ఈ సినిమాకు నేనే సంభాషణల్ని అందించా. పెళ్లి, విడాకులతో ముడిపడిన పాయింట్ కావడంతో కథానుగుణంగానే ఈ సినిమాకు ‘మ్యాడ్’ అనే టైటిల్ పెట్టాం. కమర్షియల్ హంగుల కోసమే కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్ని నాయకానాయికలపై చిత్రీకరించాం. సహజీవనం నేపథ్యంలో సాగే కథ కావడంతోనే రొమాన్స్ లేకుండా సినిమా చేయలేమనిపించింది. సినిమా రూపకల్పనలో సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చక్కటి సలహాలిచ్చారు. మోహిత్ రెహ్మానియాక్ సంగీతం, శక్తిశ్రీగోపాలన్, ఉన్నికృష్ణన్, జీన్స్ శ్రీనివాస్, నరేష్ అయ్యర్ వంటి ప్రముఖ గాయనీగాయకులు పాడిన పాటలన్నింటికి చక్కటి ఆదరణ లభిస్తోంది. చిన్న సినిమా అయినా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించాం.
కొవిడ్ కారణంగా ఆలస్యం
నేను అనుకున్న పాయింట్ను పరిపూర్ణంగా తెరపై ఆవిష్కరించాననే సంతృప్తి ఉంది. మాధవ్ చిలుకూరి, రజత్ రాఘవ్, స్పందన, శ్వేతవర్మతో పాటు ప్రతి పాత్రకు సమప్రాధాన్యత ఉంటుంది. నాయకానాయికలు కొత్తవాళ్లయినా చక్కటి నటనను కనబరిచారు. ఈ సినిమా చూసిన వారంతా ఇప్పటివరకు వెండితెరపై రాని సరికొత్త కథాంశమిదని ప్రశంసిస్తున్నారు. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. ప్రస్తుతం కొవిడ్ ఉధృతమవుతున్న పరిస్థితుల్లో కొన్నాళ్లు వేచిచూడాల్సి వస్తోంది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాతే సినిమాను విడుదలచేస్తాం. ఓటీటీల నుంచి అవకాశాలు వస్తున్నాయి. థియేటర్లలోనే విడుదలచేయాలని అనుకుంటున్నాం. నేను చెప్పిన కథతో పాటు నా ప్రతిభపై ఉన్న నమ్మకంతో స్నేహితులు ఈ సినిమాను నిర్మించారు. విభిన్నమైన కథాంశాలతో తదుపరి సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నా.