Biomass | న్యూఢిల్లీ, జనవరి 29: దేశంలోని 41 శాతం మంది జనాభా వంటకు ఇంధనంగా ఇప్పటికీ కట్టెలు, ఆవు పేడ వంటి ఇతర బయోమాస్ పదార్థాలను వినియోగిస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది. దీని వల్ల ప్రతి ఏడాది 34 కోట్ల టన్నుల కార్బన్డై ఆక్సైడ్ వాయువు వాతావరణంలోకి విడుదల అవుతున్నదని, ఇది భారత కర్బన ఉద్గారాల్లో దాదాపు 13 శాతమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అనే మేధో సంస్థ ‘ఇండియాస్ ట్రాన్సిషన్ టూ ఈ-కుకింగ్’ నివేదికలో వెల్లడించింది. దేశంలో ఎల్పీజీ కవరేజ్ 99.8 శాతంగా ఉన్నదని కేంద్ర పెట్రోలియం శాఖ చెప్పినప్పటికీ, 41 శాతం మంది ఇంకా బయోమాస్పై వంట చేస్తున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5)లో వెల్లడైందని పేర్కొన్నది.
ఒక్కసారీ రీఫిల్ చేయించని 50 శాతం కుటుంబాలు
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం(పీఎంయూవై) భారత్లో ఎల్పీజీని పొందడంలో వేగవంతమైన విస్తరణకు దారితీసిందని, అయితే ఈ పథకం నుంచి లబ్ధిపొందిన వారి ఇండ్లలో ‘క్లీన్ కుకింగ్’ దిశగా నిరంతర పరివర్తనకు హామీ ఇవ్వలేదని అభిప్రాయపడింది. పీఎంయూవై కింద కొత్త ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు పొందిన వారిలో 50 శాతానికి పైగా కుటుంబాలు కనీసం ఒక్కసారి కూడా రీఫిల్ చేయించుకోలేదని సీఎస్ఈ తన నివేదికలో పేర్కొన్నది. దీనికి అధిక గ్యాస్ ధరలు, తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఎల్పీజీ పంపిణీ నెట్వర్క్ లేకపోవడం, ఇతర విశ్వాసాలు వంటివి కారణాలుగా ఉన్నాయని తెలిపింది. గత ఏడాది మార్చి వరకు గృహ వినియోగ సిలిండర్ ధరలు మండిపోయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు రూ.1,100 ధర నడిచింది.
ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు
50 కోట్ల మంది భారతీయులతో సహా ప్రపంచ జనాభాలో దాదాపు మూడో వంతు(సుమారు 240 కోట్లు) మందికి ఇంకా పరిశుభ్రమైన కుకింగ్ వసతులు అందడం లేదని, దీని వలన పర్యావరణంతో సహా ఆర్థిక వ్యవస్ధ, ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతుందని పేర్కొన్నది. ఇండోర్ వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది దాదాపు 30 లక్షల మంది ప్రజలు ముందస్తుగా మరణిస్తున్నారని, వీటిల్లో అధికంగా వంటచెరకు ఆధారిత వంట వలనే చోటుచేసుకొంటున్నాయని నివేదిక తెలిపింది.