తిరువనంతపురం: ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యాపార విభేదాలు పసివాడి ఉసురుతీశాయి. నాలుగేళ్ల బాలుడ్ని తండ్రి వ్యాపార భాగస్వామి నరికి చంపాడు. బాలుడి తల్లిపై కూడా దాడి చేయగా ఆమె గాయపడింది. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మెప్పాడికి చెందిన జితేష్, జయప్రకాష్ ఇరుగుపొరుగు వారేగాక వ్యాపార భాగస్వాములు. అయితే వారిద్దరి మధ్య ఆర్థికపరంగా విభేదాలు వచ్చాయి. దీంతో జయప్రకాష్ కుటుంబంపై జితేష్ పగ పెంచుకున్నాడు.
కాగా, జయప్రకాష్ భార్య అనీల గురువారం ఉదయం నాలుగేళ్ల కుమారుడు ఆదిదేవ్ను సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్తున్నది. మార్గమధ్యలో వారిని అడ్డుకున్న జితేష్ కత్తితో దాడి చేశాడు. నాలుగేళ్ల బాలుడి మెడపై నరకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి తల్లి భుజానికి కత్తి గాయమైంది.
మరోవైపు అరుపులు విన్న స్థానికులు వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి సీరియస్గా ఉన్న బాలుడ్ని మెరుగైన చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ పసివాడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. కాగా, నిందితుడు జితేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.