మద్యం మత్తులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గురిని కటకటాల పాలు చేసింది. ఈ కేసు నమోదుతో డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే జైలుపాలు ఖాయమని స్పష్టమవుతున్నది. వివరాల్లోకి వెళితే.. కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డునాంపల్లి గ్రామంలో మాచారం సాయికుమార్ మద్యం మత్తులో ఇటీవల ద్విచక్రవాహనం నడుపుతూ.. ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో గుండోల ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన మాచారం సాయికుమార్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణలో నిందితుడు సాయికుమార్కు మద్యం మత్తులో ఉన్నాడని తెలిసినా యజమాని సబావత్ అన్య వాహనాన్ని ఇవ్వడంపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అదేవిధంగా మృతిచెందిన ప్రశాంత్కు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా వాహనం ఇచ్చిన యజమాని బైండ్ల శ్రీనివాసుపై కూడా కేసు నమోదు చేశారు. ఇరు వాహనాల యజమానులను 304 పార్ట్ -2 కింద మంగళవారం అరెస్టు చేశారు. నేరం నిర్ధారణ అయితే నిందితులకు పదేండ్లు జైలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.