న్యూఢిల్లీ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ త్వరలో దేశవ్యాప్తంగా 300 ఇథనాల్ ఇంధన స్టేషన్లను ప్రారంభించబోతున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం చెప్పారు. ఇథనాల్ పంపులను తెరవాలన్న తన డిమాండ్ను పెట్రోలియం మంత్రి అంగీకరించారని తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఓ సమావేశానికి హాజరైన గడ్కరీ విలేకర్లతో మాట్లాడారు. చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రపంచంలో భారత దేశం మూడో స్థానంలో ఉంది. కర్బన ఉద్గారాలను 2070 నాటికి శూన్య స్థాయికి చేర్చాలని పట్టుదలగా కృషి చేస్తున్నది. అందుకే ఇథనాల్ను ఇంధనంగా వాడాలని ప్రయత్నిస్తున్నది. శుద్ధమైన ఇంధన వనరులుగా మారడానికి దోహదపడే విధంగా హైబ్రిడ్ వాహనాలపై పన్నుల తగ్గింపును వాణిజ్య శాఖ సమర్థించింది.