న్యూఢిల్లీ: బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు పురుషులను (Bangladeshi Men) కొందరు వ్యక్తులు కొట్టడంతోపాటు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్వలింగ సంపర్కులైన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన బంగ్లాదేశ్ జాతీయుడైన 22 ఏళ్ల యువకుడు, బీహార్కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. చదువుకుంటున్న బంగ్లాదేశ్ యువకుడికి స్వలింగ సంపర్కుల డేటింగ్ యాప్లో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
కాగా, బంగ్లాదేశ్కు చెందిన మరో గే వ్యక్తి ఇటీవల ఢిల్లీకి వచ్చాడు. ఆ దేశానికి చెందిన యువకుడి రూమ్లో అతడు ఉంటున్నాడు. ఈ నెల 17న వీరిద్దరూ కలిసి షాకర్పూర్ ప్రాంతంలో రామ్లీలా వేడుక చూసేందుకు వెళ్లారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా స్వలింగ సంపర్కుల డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తి, అతడి వెంట ఉన్న వారిని కలిశారు. వారంతా కలిసి జనం లేని పార్కుకు వెళ్లారు.
మరోవైపు స్వలింగ సంపర్కుల డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తి, అతడి అనుచరులు బంగ్లాదేశ్ వ్యక్తులను కొట్టడంతోపాటు వారిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బీహార్కు చెందిన రూమ్మేట్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
కాగా, ఆ ప్రాంతంలోని సుమారు 50 సీసీటీవీల ఫుటేజ్ను పరిశీలించడంతోపాటు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారిని పోలీసులు ప్రశ్నించారు. చివరకు ఆ వర్గానికి చెందిన నిందితులైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను 20 ఏళ్ల దేవాశిష్ వర్మ, 21 ఏళ్ల సుర్జిత్, 20 ఏళ్ల ఆర్యన్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.